ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు నేతృత్వంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్కు గురవుతున్నాయని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. శనివారం విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ హాల్లో తెదేపా అభ్యర్థులకు నిర్వహించిన వర్క్షాప్పై నిఘాపెట్టిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ జి.విశ్వేశ్వరరావును పట్టుకున్నామని తెలిపారు. ఆయన నుంచి కేశినేని చిన్ని ఫోన్ ట్యాప్ చేస్తున్నట్లు పలు ఆధారాలను సేకరించామన్నారు. ఈ వ్యవహారంపై ఆరాతీయగా డీజీ పంపితేనే వచ్చినట్టు ఆయన చెప్పారని బోండా ఉమా వెల్లడించారు. దీనికి బాధ్యులైన సీతారామాంజనేయులు, కొల్లి రఘురామిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులను ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండు చేశారు. విజయవాడలో కేశినేని చిన్ని, పట్టాభిరాంతో కలిసి బోండా ఉమా విలేకర్ల సమావేశం నిర్వహించారు.
‘‘తమ ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేస్తోందని ఓ సందర్భంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా వెల్లడించారు. పెగాసస్ సాఫ్ట్వేర్ను తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్తో కలిసి సీఎం జగన్ కూడా కొనుగోలు చేశారు. చంద్రబాబు, పవన్కల్యాణ్, పురందేశ్వరి సహా పలువురు ప్రతిపక్ష నాయకులపై నిఘా పెట్టారు. మేము ఏం మాట్లాడినా ఫోన్ ట్యాప్ చేసి వింటున్న పోలీసులు.. మా ఇళ్లు, ఆఫీసుల వద్ద గస్తీ కాస్తున్నారు. మా విషయాలన్నీ పోలీసులకు ఎలా చేరుతున్నాయని సాంకేతిక నిపుణులతో పరిశీలన చేయిస్తే ఫోన్లు ట్యాప్ అయినట్లు నిర్ధరణ అయింది. దీనిపై సీఎం జగన్ వెంటనే సమాధానం చెప్పాలి. ఈ కుట్రచేసిన, చేయిస్తున్న అందరిపై చర్యలు తీసుకుంటేనే రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పాక్షికంగా జరుగుతాయి. ఈ వ్యవహారంపై సీఈఓను కలిసి అన్ని ఆధారాలు సమర్పిస్తాం’’ అని బోండా ఉమా పేర్కొన్నారు.
source: eenadu.net
Discussion about this post