‘నిజం గెలవాలి..’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడి సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో గుండెపోటుతో మరణించిన తెదేపా కార్యకర్తల కుటుంబాలను మంగళవారం పరామర్శించారు. గుడుపల్లె మండలం కొడతనపల్లెలో వెంకటేష్ కుటుంబాన్ని ఓదార్చారు. ముగ్గురు కుమారులు తులసీరామ్(7), మోక్షిత్(5), మౌర్య(3) విద్యాభ్యాసం బాధ్యత ఎన్టీఆర్ ట్రస్టు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. వెంకటేష్ భార్య సౌమ్య, తల్లిదండ్రులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. యామగానిపల్లెలో శ్రీనివాసులు ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కుప్పం పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న నారా భువనేశ్వరికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని, జిల్లా నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. రోడ్డు మార్గంలో మహిళలు, తెదేపా నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. మహిళలు హారతులు పడుతూ.. జై బాబు.. జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు.
source : eenadu.net
Discussion about this post