తొలిసారిగా ఓటు వేయబోతున్నామని, మా తొలి ఓటు తెదేపాకే వేసి గెలుపునకు కృషి చేస్తామని కళాశాల విద్యార్థులు స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం అనంతపురం నగరంలో ప్రైవేటు కళ్యాణ మండపంలో రాయదుర్గం నియోజకవర్గ విద్యార్థులతో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ముఖాముఖి నిర్వహించారు. అనంతపురంలో వివిధ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు హాజరై సమకాలీన రాజకీయాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అనే అరాచక శక్తి రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టించారన్నారు. ప్రజల ఆశయాలను వమ్ము చేస్తూ, పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న వైకాపా ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించాలని యువతకు పిలుపునిచ్చారు. జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదన్నారు. పరిశ్రమలు రాని కారణంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కలగానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా-జనసేన కూటమి కొలువుదీరిన తర్వాత రానున్న ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత కూటమిపై ఉందన్నారు.
source : eenadu.net










Discussion about this post