ఎన్నికల ముందు ఒక్క అవకాశమంటూ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును వైఎస్ జగన్మోహన్రెడ్డి నట్టేట ముంచారని మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, తెదేపా సీనియర్ నేత గౌరు వెంకటరెడ్డి అన్నారు. మండలంలోని తిప్పాయిపల్లెలో బాబు స్యూరిటీ.. భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. వైకాపా నేత సుధాకరరెడ్డి ఆధ్వర్యంలో పలువురు తెదేపాలో చేరారు. అనంతరం గౌరు దంపతులు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, దీనికి త్వరలోనే చరమగీతం పాడే రోజులు దగ్గరలో వచ్చాయన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైకాపాకు పతనం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెదేపా వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, పార్టీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్రెడ్డి, నాయకులు సుధాకరరెడ్డి, శ్యామ్సుందరరెడ్డి, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
source : eenadu.net










Discussion about this post