‘స్థానిక సంస్థల ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గంలోని 55 సర్పంచి స్థానాల్లో వైకాపా మద్దతుదారులు గెలుస్తారన్నారు. మిగిలినవన్నీ తెదేపా సొంతం చేసుకుంటుందని పేర్కొన్నారు. ఆ పరిస్థితుల్లో ఏం చేద్దాం.. ఎలా చేద్దామని ఆలోచించాం. నిమ్మాడలో మాకు మద్దతిచ్చే కింజరాపు అప్పన్న సర్పంచి అభ్యర్థిగా నామినేషన్ వేయకుండా తెదేపావారు ఇబ్బంది పెట్టారు. ఆ సాకుతో నేను ఆ ఊరిపై దాడి చేసి ఆయనతో నామినేషన్ వేయించా. నన్ను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కొట్టారని చెప్పి ఆయన్ని జైల్లో పెట్టించి వారి కార్యకర్తలు వీధుల్లోకి రాకుండా చేశాం. బయటకొస్తే మీ అంతు చూస్తామని సంతబొమ్మాళి జడ్పీటీసీ అభ్యర్థి పుక్కళ్ల శ్రీనివాసరావును హెచ్చరించి ఆయనపై రౌడీషీట్ తెరిపించి అరెస్టు చేయించాం. కోటబొమ్మాళి జడ్పీటీసీ అభ్యర్థి పూజారి శైలజ భర్త సత్యం ఇంటి తలుపులు వేసి బంధించాం. టెక్కలి, నందిగాంలలో జడ్పీటీసీ అభ్యర్థులను బయటకు రాకుండా చేశాం. నాలుగు చొప్పున ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు, 136 పంచాయతీల్లో 119 పంచాయతీలు గెలిచాం. అచ్చెన్నాయుడిని లోపల వేయడం, ఆ పార్టీ క్యాడర్ను భయపెట్టడం.. ఇలా రౌడీయిజమే చేశాం..’ అంటూ వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
అనుచరుల వద్ద ఆయన చేసిన వ్యాఖ్యలంటూ బయటకు రావడంతో అవి చర్చనీయాంశమవుతున్నాయి. సర్పంచి ఎన్నికల సమయంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి స్వగ్రామం నిమ్మాడలో చోటుచేసుకున్న సంఘటనలు, అందుకు దారితీసిన పరిస్థితులు, హత్యాయత్నం కేసులో అచ్చెన్నాయుడి అరెస్టు, అనంతర పరిణామాలను ఎమ్మెల్సీ ప్రస్తావించినట్లు ఉండటం సంచలనంగా మారింది. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సమయంలో నిమ్మాడ గ్రామానికి దువ్వాడ శ్రీనివాస్ వెళ్లారు. అక్కడ కర్రలతో స్వైరవిహారం చేశారు. ఆ వెంటనే ఆయనకు ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి జగన్ అవకాశమిచ్చారు. ఈ సంఘటన ఆధారంగానే పదవి వచ్చిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో అప్పట్లో సాగింది. రౌడీయిజం చేసి గెలిచామని అప్పట్లో ఆయన చేశారంటున్న వ్యాఖ్యలు తాజాగా బయటకు రావడం కలకలం రేపింది.
source : eenadu.net
Discussion about this post