‘‘వేల మంది మగవారు ఉన్న బహిరంగ సభలో సొంత చెల్లి అని చూడకుండా సీఎం జగన్ నేను ధరించిన దుస్తుల గురించి ప్రస్తావించారు. నేను పచ్చ చీర కట్టుకున్నానట. పచ్చ చీర కట్టుకుని చంద్రబాబుకు మోకరిల్లినట్లు జగన్ చెప్పడాన్ని ఏమనుకోవాలి. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు ప్రకారం మాట్లాడుతున్నానట. పచ్చచీర కట్టుకుంటే తప్పేముంది. చంద్రబాబు పచ్చరంగు ఏమైనా కొనుక్కున్నారా? పసుపు రంగుపై చంద్రబాబుకు ఏమైనా పేటెంట్ ఉందా? జగన్ మరిచిపోయినట్లున్నారు… సాక్షి పత్రిక, సాక్షి ఛానల్లో పైన పసుపు రంగు ఉంటుంది. అప్పట్లో వైఎస్సార్ పసుపు రంగు ఉంటే తప్పేముంది. అది తెదేపా సొంతం కాదన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాళ్లు పసుపు చీర గురించి మాట్లాడతారా? నా దుస్తుల గురించి మాట్లాడుతుంటే సభ్యత ఉందని అనుకోవాలా? జగన్రెడ్డికి అసలు సంస్కారం ఉందా?’’ అని షర్మిల మండిపడ్డారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి, విజయవాడ, గుంటూరు జిల్లా సంజీవయ్యనగర్లో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో షర్మిల మాట్లాడారు. ‘రాసిచ్చిన స్క్రిప్టును చదివేది జగన్మోహన్రెడ్డి. నేను వైఎస్సార్ బిడ్డను. నాకు మోకరిల్లే అవసరం లేదు. వైకాపా కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో నాపై తప్పుడు ప్రచారం చేశారు. నన్ను దూషించారు.. బెదిరించారు. సొంత చెల్లెలి గురించి ఆలోచించకుండా మగవారి మధ్య మాట్లాడటం సభ్యతేనా?’ అని నిలదీశారు. ‘రాష్ట్రంలో ఏం జరుగుతోందో ఆలోచించాలి. భాజపా, మోదీ ముందు మోకరిల్లింది జగన్మోహన్రెడ్డి. పోలవరం, ప్రత్యేక హోదా, ప్రాజెక్టులను తాకట్టు పెట్టారు. దిల్లీకి వెళ్లినప్పుడు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడకుండా స్వప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు. అవినాష్రెడ్డిని రక్షించడానికి దిల్లీ వెళ్తున్నారు. వైఎస్సార్కు జగన్ వారసుడు కాదు. మోదీకి వారసుడు. మోదీకి దత్తపుత్రుడిగా భాజపా నాయకులే చెబుతున్నారు’ అని షర్మిల పేర్కొన్నారు.
source : eenadu.net
Discussion about this post