లిక్కర్ కాంట్రాక్టులన్నీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి బినామీలవేనని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. న్యాయయాత్రలో భాగంగా ఆమె కార్వేటినగరం, పలమనేరుల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆమె మాట్లాడారు. ఎక్సైజ్శాఖ మంత్రి నారాయణస్వామి అంబేడ్కర్ శిష్యుడినని చెప్పుకొంటారని, ఆయన ఆశయాలను నిలబెట్టడమంటే కల్తీ మద్యం అమ్మడమా అని ప్రశ్నించారు. స్పెషల్ స్టేటస్, క్యాపిటల్, ప్రెసిడెంట్ మెడల్, డీఎస్సీ మద్యం బ్రాండ్లన్నీ ఆయనవేనని, ఇతర బ్రాండ్లు అమ్మనీయకుండా బాగా సంపాదించారని విమర్శించారు. నాసిరకం మద్యం తాగడంతో ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో 25 శాతం ఎక్కువ మంది కిడ్నీ, లివర్ పాడై మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఒకవైపు బటన్ నొక్కుతూ మరోవైపు నిత్యావసర ధరలు, ఇసుక దోపీడీ, మద్యం, విద్యుత్తు ఛార్జీలు, గ్యాస్ ధరలు పెంచి ప్రజలను లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో మూతపడ్డ చక్కెర కర్మాగారాలను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. జీడీనెల్లూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రమేష్బాబును ఆమె పరిచయం చేశారు.
source : eenadu.net
Discussion about this post