భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ నామినేషన్ కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా సాగింది. తెదేపా, భాజపా, జనసేన కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో హాజరు కావడంతో పట్టణం కాషాయం, పసుపుమయంగా మారిపోయింది. ముందుగా సత్యకుమార్ శివానగర్లోని శివాలయంలో కుటుంబ సభ్యులు, తెదేపా ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్, భాజపా నాయకులు, సినీ నటుడు సాయికుమార్, జనసేన రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్తో కలిసి పూజలు చేశారు. అనంతరం ఓపెన్ టాప్ జీపులో వేలాది మంది కార్యకర్తలతో కలిసి ప్రదర్శనగా వెళ్లారు. ధర్మవరం ఆర్డీఓ కార్యలయం సమీపంలోకి ప్రదర్శన రాగానే కేంద్ర మంత్రి వి.కె.సింగ్ ప్రత్యేక హెలికాప్టర్లో అక్కడికి చేరుకున్నారు. కేంద్ర మంత్రికి నాయకులు స్వాగతం పలికారు. ఎన్నికల అధికారులకు పత్రాలు సమర్పించిన నాయకులకు పట్టణంలోని కళాజ్యోతి సర్కిల్లో కార్యకర్తలు గజమాలతో సన్మానించారు.
source : eenadu.net
Discussion about this post