అధికార వైకాపాతో అంటకాగుతూ… గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. నిఘా విభాగాధిపతి పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా… ఎన్నికల షెడ్యూలు వచ్చాక కూడా వైకాపాకు అనుకూలంగా ఏకపక్షంగా పనిచేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపిన ఎన్నికల సంఘం చివరికి వారిద్దరిపై చర్యలు తీసుకుంది. తర్వాత స్థానాల్లో ఉన్న అధికారులకు బాధ్యతలు అప్పగించి, తక్షణమే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యేవరకూ వారికి ఎన్నికల సంబంధిత విధులేవీ అప్పగించొద్దని నిర్దేశించింది. వీరి స్థానాల్లో వేరే అధికారులను నియమించేందుకు వీలుగా… ఒక్కో పోస్టుకు ముగ్గురేసి ఐపీఎస్ అధికారుల పేర్లతో బుధవారం మధ్యాహ్నం 3 గంటల్లోగా ప్యానల్ సమర్పించాలని సీఎస్ జవహర్రెడ్డికి మంగళవారం ఆదేశాలు జారీచేసింది. నిఘా విభాగాధిపతి పోస్టు కోసం అదనపు డీజీ, అంతకంటే ఎక్కువ హోదా కలిగిన అధికారుల వివరాల్నే పంపాలని పేర్కొంది.
ప్రభుత్వ పెద్దల అండదండలు చూసుకుని కాంతిరాణా ఎగిరెగిరి పడ్డారు. అఖిలభారత సర్వీసు అధికారిననే విషయం మరిచిపోయి.. అచ్చం వైకాపా అధికార ప్రతినిధిలా వ్యవహరించారు. ప్రతిపక్షపార్టీ నేతలను కక్షపూరితంగా వేధిస్తూ, వారిపై అక్రమ కేసులు బనాయించారు. అధికార పార్టీ నాయకులు దాడులు, దౌర్జన్యాలకు తెగబడితే వారిని వదిలేసి బాధితులపైనే రివర్స్ కేసులు పెట్టారు. తెదేపాలో క్రియాశీల నేతలను లక్ష్యంగా చేసుకుని వేధించారు. ఎన్నికల షెడ్యూలు వచ్చాక కూడా వైకాపా పట్ల తన విధేయత, స్వామిభక్తిని ప్రదర్శించటంలో కాంతిరాణా వెనక్కి తగ్గలేదు. తెదేపా, భాజపా, జనసేనతో పాటు మీడియాపైన రాజకీయపరమైన విమర్శలు చేస్తూ ఇటీవల ఎన్నికల సంఘానికి ఫిర్యాదిచ్చారు. కానీ అదే ఎన్నికల సంఘం ఆయన వైకాపాతో అంటకాగుతున్నారనే ఫిర్యాదుల ఆధారంగా తాజాగా వేటు వేసింది. తాను కళంకితుడిగా ఉంటూ.. వైకాపాతో అంటకాగుతున్నారనే అభియోగాలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులందరి తరఫున వకల్తా పుచ్చుకుని మీడియా, ప్రతిపక్షాలపై రాజకీయంగా విషం చిమ్మటం కాంతిరాణాకే చెల్లింది. ఇవే అంశాలతో ఐపీఎస్ అధికారుల సంఘం పేరిట ఆయనే ప్రకటన విడుదల చేసేశారు. కాంతిరాణా భార్య ఐఆర్ఎస్ అధికారి. భువనేశ్వర్లో పనిచేస్తున్న ఆమెను ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి, వైద్యారోగ్య శాఖలో కీలక పోస్టింగ్ ఇప్పించుకున్నారు. అందుకు ప్రతిఫలంగా అన్నట్లు వైకాపా అరాచకాలకు మరింతగా కొమ్ముకాశారు.
అనంతపురం రేంజి డీఐజీగా పనిచేసినప్పుడు మంత్రి పెద్దిరెడ్డి చెప్పిందే చట్టం అన్నట్లుగా పనిచేశారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో వైకాపా నాయకులు పెద్ద ఎత్తున దొంగ ఓటర్లను బస్సుల్లో తీసుకొస్తుంటే వారిని అడ్డుకోలేదు. అప్పటి ఎస్పీ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఆయన్ను నిలువరించారన్న ఫిర్యాదులున్నాయి. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అక్రమాలపై నమోదైన కేసుల్ని నీరుగార్చారు. చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులో తెదేపా శ్రేణులపై పెద్ద ఎత్తున అక్రమ కేసులు బనాయించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా నాయకుల అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచారు.
సీఎం జగన్పైకి గులకరాయి విసిరిన ఘటనకు భద్రతా వైఫల్యమే ప్రధాన కారణం. ఈ వ్యవహారంలో వేళ్లన్నీ కాంతిరాణా వైపే చూపిస్తున్నాయి. ఈ ఘటనపై హత్యాయత్నం (ఐపీసీ 307) సెక్షన్ కింద కేసు నమోదుచేసిన కాంతిరాణా… అందులో తెదేపా నాయకుల్ని ఇరికించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. తద్వారా వైకాపాకు మేలు కలిగించేలా దర్యాప్తు చేశారన్న ఫిర్యాదులున్నాయి. ఈ కేసులో తెదేపా నాయకుడు వేముల దుర్గారావును అదుపులోకి తీసుకుని నాలుగైదు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారు. ఆయన ఆచూకీ కోసం హైకోర్టులో హెబియస్ కార్పెస్ పిటిషన్ వేసేందుకు కుటుంబసభ్యులు సిద్ధమవడంతో ఇక తప్పక విడిచిపెట్టారు. తెదేపా మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేరు చెప్పాలంటూ పోలీసులు తనపై ఒత్తిడి తీసుకొచ్చారని దుర్గారావు మీడియాకు వివరించారు. జగన్పై గులకరాయి విసిరితే హత్యాయత్నం సెక్షన్ పెట్టిన కాంతిరాణా… 2022 నవంబరులో నందిగామ వద్ద ప్రతిపక్ష నేత చంద్రబాబుపై రాళ్లతో దాడిచేసిన ఘటనలో మాత్రం వెంటనే కేసు పెట్టలేదు. తర్వాత తప్పనిసరై ప్రమాదకర ఆయుధంతో దాడి (ఐపీసీ సెక్షన్ 324) కింద కేసు పెట్టేసి మమ అనిపించేశారు. అయినా ఇప్పటికీ నిందితులెవరో గుర్తించలేదు. అంతే కాదు.. ‘‘చంద్రబాబుపైకి పూలు వేసినప్పుడు.. వాటితో పాటు రాయి వచ్చి ఉండొచ్చు’’ అని ఆ ఘటనపైన అప్పట్లో వ్యంగ్యంగా మాట్లాడారు. సీఎం జగన్కు పూలదండ వేసినప్పుడు గాయమైందని అంటున్నారు కదా అని ఇటీవల కాంతిరాణాను విలేకరులు ప్రశ్నించగా… కాదు, రాయి విసరటం వల్లే జరిగిందని చెప్పారు. అధికార, ప్రతిపక్షాల విషయంలో ఆయన ఎలా వ్యవహరిస్తారో చెప్పేందుకు ఈ ఉదంతం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.
source : eenadu.net
Discussion about this post