కురుక్షేత్ర యుద్ధానికి తామూ సిద్ధమని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ప్రజలంతా తమ వెంటే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. శనివారం అనంతపురం జిల్లా ఉరవకొండ, అన్నమయ్య జిల్లా పీలేరులలో ‘రా.. కదలిరా’ బహిరంగసభలలో ఆయన మాట్లాడారు. ‘ఎన్నికల ముందే జగన్ ఓటమిని ఆమోదించారు. 2021లో నా వెంట్రుక కూడా పీకలేరన్నారు. 2022లో దయచేసి నన్నే నమ్మండి అన్నారు. 2023లో నాకు ఎవరూ లేరు.. మిమ్మల్నే నమ్ముకున్నానని అన్నారు. 2024కు వచ్చేసరికి ఆనందంగా దిగిపోతానని అంటున్నారు.. ఆయన దిగిపోవడం కాదు.. ప్రజలే ఆయన్ను దించేస్తారు. 70 రోజుల్లోనే రాష్ట్రానికి పట్టిన శని వదిలిపోతుంది. జగన్ పాలనలో రాష్ట్రంలో దెబ్బతినని రంగం ఏదైనా ఉందా? తెదేపా, జనసేన కార్యకర్తలు పదడుగులు ముందుకేస్తే నేను వంద అడుగులు వేస్తా. ‘సిద్ధం’ అంటూ భారీ హోర్డింగులు పెట్టిన అధికార వైకాపాకు సరేనంటూ మేమూ సవాలు విసురుతున్నాం’ అని శ్రేణులకు ధైర్యం చెప్పారు.
‘మొన్న ఉరవకొండలోనే సీఎం సభ పెట్టారు. ఆ సభకు, తెదేపా సభకు పోలికే లేదు. అది జనాన్ని తరలించిన సభ. ఇది జనసంద్రమైన సభ. దీనికి పోలీసులే సాక్ష్యం. ఆయన్ని విమర్శించిన ప్రతి ఒక్కరినీ తెదేపా స్టార్ క్యాంపెయినర్లుగా జగన్ అభివర్ణిస్తున్నారు. నిజమే.. ఐదేళ్ల పాలనలో జగన్ చేతిలో మోసపోయిన ప్రతి బాధితుడు స్టార్ క్యాంపెయినరే. జాబ్ క్యాలెండర్ ఇస్తారని నమ్మి మోసపోయిన యువత, నష్టపోయిన రైతులు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలు అందరూ నాకు స్టార్ క్యాంపెయినర్లే. ప్రతి ఆడబిడ్డ తెదేపా-జనసేనకు స్టార్ క్యాంపెయినర్ కావాలి’ అని పిలుపునిచ్చారు.
source : eenadu.net
Discussion about this post