‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముందు రోజు ‘చేయూత’ పథకం ద్వారా అక్కచెల్లెమ్మలకు ఆర్థిక సాయం చేయడం సంతోషంగా ఉంది. గత 58 నెలల పాలనలో వారి ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ముందడుగు వేశాం. దేశంలో మరే ప్రభుత్వం చేయని విధంగా చేయూతనిచ్చాం. మాది మహిళా పక్షపాత ప్రభుత్వం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వైఎస్సార్ చేయూత నాలుగో విడత ఆర్థిక సాయాన్ని గురువారం అనకాపల్లి జిల్లా పిసినికాడలో బటన్ నొక్కి విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 26,98,931 మంది మహిళలకు రూ.5,060 కోట్ల సాయాన్ని అందించినట్లు తెలిపారు. 14 రోజులపాటు పండగ వాతావరణంలో చేయూత పంపిణీ జరుగుతుంది, సచివాలయాల్లో లబ్ధిదారులతో మైకుల్లో మాట్లాడించాలని అధికారులకు సూచించారు. ‘ఇదే జిల్లా కె.కోటపాడు మండలంలో పాదయాత్ర సమయంలో చేయూత పథకాన్ని ప్రకటించాను. ఈరోజు ఆఖరి విడత సాయం ఇక్కడే విడుదల చేయడం గర్వంగా ఉంది’ అని సీఎం వివరించారు.
‘గత ప్రభుత్వ హయాంలో పొదుపు సంఘాలు కుదేలైపోయాయి. మేం వచ్చిన తర్వాత వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ పథకాలతో వాటికి ఊపిరి పోశాం. ఈరోజు 98.83 శాతం రుణ రికవరీతో మన పొదుపు సంఘాలు దేశంలోనే నంబర్ వన్గా నిలిచాయి. మేం నాలుగేళ్లలో రూ.19,189 కోట్లు చేయూత ద్వారానే అందించాం. ప్రతి ఇంట్లో మహిళలను లక్షాధికారులుగా మార్చాం. అక్కచెల్లెమ్మల రక్షణ కోసం దిశ యాప్, పోలీస్స్టేషన్లు తీసుకొచ్చాం. యాప్తో 35 వేల మంది మహిళలు రక్షణ పొందారు’ అని వివరించారు.
‘గత ప్రభుత్వంలో ఎప్పుడైనా మహిళలకు మేలు చేసే ఆలోచన ఒక్కటైనా చేశారా? చంద్రబాబునాయుడు, దత్తపుత్రుడి పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుందో తెలుసా? మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన బాబును చూస్తే మోసం, నయవంచన, దగా గుర్తుకొస్తాయి. కార్లు మార్చినట్లు భార్యలను మార్చే ఈ విలువలు లేని దత్తపుత్రుడు వివాహ వ్యవస్థకే ఒక కళంకంగా, మాయని మచ్చగా గుర్తుకొస్తారు’ అని పవన్ కల్యాణ్పై జగన్ మరోసారి వ్యక్తిగత విమర్శలు చేశారు. ‘2014లో వీరిద్దరూ కలిసి మేనిఫెస్టోతో అధికారంలోకి వచ్చారు. వాటిలో ఒక్కటి కూడా అమలు చేయలేదు. పథకాలకు అమ్మవారి పేర్లు పెట్టి మరీ మోసం చేశారు. ఇప్పుడు మళ్లీ మహాశక్తి పేరుతో వస్తున్నారు. బీసీలకు గతంలో 143 వాగ్దానాలు చేశారు. అమలు పెద్ద సున్నా. వీరిని నమ్మడం అంటే కాటేసే పామును పెంచడం.. తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడమే’ అని విమర్శించారు.
source : eenadu.net
Discussion about this post