‘రెండునెలలు ఓపిక పట్టండి. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అందరి కష్టాలు తీరతాయి’ అని నారా బ్రాహ్మణి భరోసా ఇచ్చారు. మంగళగిరి చేనేతకు ప్రపంచస్థాయి గుర్తింపు తేవడమే లక్ష్యంగా నారా లోకేశ్ పనిచేస్తున్నారన్నారు. ఆదివారం మంగళగిరిలోని బేతపూడిలో మల్లెపూల తోటల్లో పూలుకోసే మహిళా కూలీలతో ఆమె మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఇప్పటికే ‘టాటా తనేరా’ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని చేనేత కార్మికుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు లోకేశ్ కృషి చేస్తున్నారని తెలిపారు. అమరావతిని విధ్వంసం చేసి ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఈ ప్రభుత్వం దెబ్బతీసిందని మండిపడ్డారు.
పెరిగిన నిత్యావసరాల ధరలు, ఇంటి పన్నులు, విద్యుత్తు బిల్లులు కట్టలేకపోతున్నామని.. రోజంతా పనిచేసినా కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారిందని మహిళా కూలీలు బ్రాహ్మణికి వివరించారు. ఆమె స్పందిస్తూ.. ‘చంద్రబాబు ముఖ్యమంత్రిగా వస్తారు.. మీ కష్టాలు తీరుస్తారు’ అని భరోసా ఇచ్చారు. స్త్రీశక్తి కేంద్రాల్లో కుట్టు శిక్షణ తీసుకుని అదనపు ఆదాయం పొందాలని వారికి సూచించారు.
source : eenadu.net
Discussion about this post