ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం తథ్యమని గుర్తించిన విపక్ష కూటమి టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో భారీ కుట్రకు బరితెగించింది. అందుకోసం పక్కా పన్నాగంతో పోలీసు వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంది. పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొనేందుకు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి కుట్ర పన్నింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై శనివారం రాత్రి విజయవాడలో జరిగిన దాడి దీనికి బలం చేకూరుస్తోంది.
సీఎం జగన్పై జరిగిన ఈ దాడి ఆషామాషీగానో, ఆకతాయిగానో చేసింది కాదని, దాని వెనుక భారీ కుట్రే ఉందన్నది తేటతెల్లమవుతోంది. రెండు నెలలుగా రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేస్తున్న దుష్ప్రచారం వెనుక గూడుపుఠాణి ఉందన్న విషయం ఈ దాడితో బట్టబయలైంది.
నిత్యం ప్రజాధరణతో దూసుకుపోతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీని ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఓడించలేమని చంద్రబాబు ఏనాడో గుర్తించారు. అందుకే పవన్, పురందేశ్వరితో కూటమి కట్టారు. రాష్ట్రంలో ధ్వంస రచనకు కుట్ర పన్నారు. అందులో భాగంగానే కీలకమైన పోలీసు వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నారు. చంద్రబాబు, లోకేశ్ ఐపీఎస్ అధికారుల నుంచి ఎస్సైస్థాయి అధికారుల వరకు అందరిపై నిరాధార ఆరోపణలకు తెరతీశారు.
వలంటీర్లు రాష్ట్రంలో యువతులను అపహరిస్తున్నారని పవన్ జుగుప్సాకరమైన ఆరోపణలకు కూడా దిగారు. అయినా పోలీసు వ్యవస్థ చేష్టలుడిగి చూస్తోందని అవాకులు చవాకులు పేలారు. ఇక బీజేపీతో పొత్తు కుదరగానే చంద్రబాబు ముందస్తు వ్యూహంతో పురందేశ్వరిని రంగంలోకి దింపారు. చంద్రబాబు ఇచ్చిన జాబితా ప్రకారం ఆమె ఏకంగా రాష్ట్రంలో 20 మందికిపైగా సీనియర్ ఐపీఎస్ అధికారులపై నిరాధార ఆరోపణలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
వారందరినీ ఎన్నికల విధుల నుంచి తొలగించాలని, వీలైతే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాదు.. వారి స్థానాల్లో ఎవర్ని నియమించాలో కూడా దగ్గుబాటి పురందేశ్వరే నిర్దేశించడం కూటమి కుట్రకు పరాకాష్ట. అంటే పోలీసు వ్యవస్థను పూర్తిగా తమ గుప్పిట్లో ఉంచుకొని, ఎన్నికల్లో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడాలన్నది చంద్రబాబు ముఠా లక్ష్యమన్నది సుస్పష్టమైంది .
source : sakshi.com
Discussion about this post