దేశాన్ని బలమైన ఆర్థికశక్తిగా రూపొందించేందుకు ప్రధాని నరేంద్రమోదీ కృషిచేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. మోదీ ప్రధాని కాకముందు ప్రపంచంలో మన దేశ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉండగా, ఇప్పుడు 5వ స్థానానికి చేరిందని తెలిపారు. మోదీ సోమవారం హరియాణాలోని గుడ్గావ్ నుంచి వర్చువల్గా రాష్ట్రంలోని రూ.30 వేల కోట్ల జాతీయ రహదారుల జాతికి అంకితం, శంకుస్థాపనలను చేశారు. విజయవాడలోని నోవాటెల్లో జరిగిన కార్యక్రమంలో పురందేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మంచి రోడ్లు ఉంటేనే అన్నిరకాలుగా అభివృద్ధి సాధించేందుకు వీలుంటుందన్నారు. గత పదేళ్లలో రాష్ట్రంలో రూ.70 వేల కోట్లతో జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిందని, ఇప్పుడు మరో రూ.30 వేల కోట్ల పనులు మొదలయ్యాయని తెలిపారు. 2014కి ముందు దేశంలో రోజుకు సగటున 12-13 కి.మీ.మేర జాతీయ రహదారుల నిర్మాణం జరగ్గా, ప్రస్తుతం 28-30 కి.మీ. నిర్మించే స్థాయికి ఎదిగామని వెల్లడించారు. 2047 నాటికి సర్వతోముఖాభివృద్ధి సాధించిన భారత్ను చూడాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ ఉన్నారని చెప్పారు. ప్రజలకు సరైన రీతిలో సంక్షేమం అందించడంతోపాటు, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టిసారించారని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ మాట్లాడుతూ బెంగళూరు నుంచి అమరావతి (కొడికొండ-మేదరమెట్ల) మధ్య నిర్మించే డెడికేటెడ్ కారిడార్తో ప్రయాణ సమయం 4 గంటలు తగ్గుతుందన్నారు. ఆర్అండ్బీ కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రూ.లక్ష కోట్ల పనులకు సోమవారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తుంటే అందులో రూ.30 వేల కోట్లవి మన రాష్ట్ర పరిధిలోనివేనన్నారు.
ఏపీలో రూ.5,411 కోట్లతో నిర్మించిన 252 కి.మీ. జాతీయ రహదారులను ప్రధాని జాతికి అంకితం చేశారు. అలాగే రూ.23,984 కోట్లతో నిర్మించనున్న 882 కి.మీ.మేర జాతీయ రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు.
source : eenadu.net
Discussion about this post