పేదల ఇళ్ల నిర్మాణానికి జగన్ అధికారం చేపట్టాక రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ద్వారా ఇప్పటివరకు రూ.21,412 కోట్లు ఖర్చు పెట్టినట్టు బడ్జెట్ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.4 వేల కోట్లే. మిగతా రూ.17,412 కోట్లు కేంద్ర ప్రభుత్వమే వెచ్చించింది. మెజారిటీ నిధులు కేంద్రానివి అయితే జగన్ మాత్రం వైకాపా ప్రభుత్వమే పేదలకు ఇళ్లు కట్టిస్తున్నట్టు డప్పు కొట్టుకుంటున్నారు.
ఇళ్లు కాదు, ఊళ్లు కడుతున్నామంటూ ఇన్నాళ్లు ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్.. అధికార పీఠం ఎక్కిన తర్వాత ఇప్పటివరకు పేదల గూడు కోసం ఖర్చు పెట్టిన మొత్తాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి (మౌలిక సదుపాయాల కల్పనతో కలిపి) గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఖర్చు పెట్టింది రూ.8 వేల కోట్లే. రాష్ట్రవ్యాప్తంగా జగనన్నకాలనీల్లో 18.64 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. వీటిలో ఇప్పటివరకు 5.94 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. మిగతా వాటి నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. ఒక్కో ఇంటిపై కేంద్రమిస్తున్న రూ.1.80 లక్షలకు (పట్టణ ప్రాంతాల్లో రూ.30 వేలు రాష్ట్ర ప్రభుత్వమిస్తోంది) అదనంగా రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా మరో రూ.లక్ష ఇవ్వాలని లబ్ధిదారులు మొత్తుకున్నా పట్టించుకోలేదు. కాలనీల్లో మౌలిక వసతులు సక్రమంగా కల్పించడం లేదు. లబ్ధిదారులను వారి కష్టానికి వారిని వదిలేశారు. గ్రామీణ పేదల పట్ల జగన్ మరింత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వారు ఇళ్లు కట్టుకోవడానికి ఒక్క రూపాయీ రాష్ట్ర ఖజానా నుంచి ఇవ్వలేదు. కేంద్రమిచ్చే నిధులతోనే సరిపెడుతున్నారు. మొత్తంగా ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన వాగ్దానం మేరకు 25 లక్షల ఇళ్లు పూర్తి కావడానికి ఇంకా రూ.30 వేల కోట్లు అవసరం. 2024-25 ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్లోనూ కేటాయింపులు నామమాత్రంగానే ఉన్నాయి. కేవలం రూ.7,062.84 కోట్లు కేటాయించారు. పైగా 2024 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు.
source : eenadu.net
Discussion about this post