సొంత పార్టీ ఎంపీలను అధినాయకత్వం చులకనగా చూస్తున్న తీరు వైకాపాలో చర్చనీయాంశమవుతోంది. వారిని పార్లమెంట్లో బిల్లులపై ఓటింగ్ సందర్భంలో తాము చెప్పినట్లు నడుచుకునే ఓటర్లుగా మాత్రమే పరిగణిస్తోంది. సభలోనూ బయటా ఏ మాత్రం స్వతంత్రంగా వ్యవహరించినా వారిని వెలివేసినట్లుగా చూస్తోంది. ప్రస్తుత లోక్సభ ఏర్పడిన తొలినాళ్లలోనే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును దూరం చేసుకున్న అధినాయకత్వం.. తన అహంకార, పెత్తందారీ పోకడలతో మరికొందరినీ ఎడం పెడుతోంది. తాజాగా జగన్ దిల్లీ పర్యటనలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఎదురైన పరాభవం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
సాయిరెడ్డి, మిథున్రెడ్డిని కాదని వెళ్తే..
దిల్లీలో సీఎం దూతలైన విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డిల ఆదేశాల మేరకే ఎంపీలంతా నడుచుకోవాలి. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం కేంద్రమంత్రులను కలవాలనుకున్నా వారి అనుమతి తీసుకోవాల్సిందే. కాదని ఏ ఎంపీ అయినా వ్యక్తిగతంగా కేంద్రమంత్రిని వారి కార్యాలయంలోనో, పార్లమెంటులోనో కలిసి వినతి పత్రమిచ్చారంటే ఇక, అంతే సంగతి. నాటి నుంచే ఆ ఎంపీని ఏకాకిని చేయడం, తమ బృందం నుంచి వెలివేయడం మొదలవుతుంది. పార్టీ ఎంపీలు బృందంగా కేంద్రమంత్రుల వద్దకు వెళ్లినా ఈ ఎంపీలను తీసుకెళ్లరు. వీరి పేరుతో ప్రశ్నలు కూడా పార్లమెంటుకు పంపరు. వైకాపా అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుతో ఈ వెలివేత మొదలైంది. తర్వాత నరసరావుపేట, మచిలీపట్నం ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరిలకు ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి. ఒక బీసీ ఎంపీ బీసీలకు రిజర్వేషన్లు, అట్రాసిటీలపై ప్రైవేటు బిల్లు సిద్ధం చేసుకుంటే సీఎం అనుమతి లేకుండా ఎలా పెడతారంటూ సాయిరెడ్డి ఆయన్ను నిలువరించారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఇటీవల దిల్లీలో విందు ఇచ్చారు. దాదాపు అన్ని పార్టీల వారూ హాజరయ్యారు. కానీ, సాయిరెడ్డి, మిథున్రెడ్డిల అనుమతి తీసుకోకుండా వెళ్లారని బాలశౌరిని పార్టీ పెద్దలు వేధించారు. ఆయన వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైనప్పటికీ పార్టీని, ఎంపీ పదవిని వదులుకోవాల్సిన పరిస్థితి కల్పించారు.
సీఎం అపాయింట్మెంట్ దొరకదే!
ఎంపీలు పార్టీ అధినేత జగన్ను కలిసే అవకాశాలే లేవు. ముఖ్యమంత్రి సహాయకుడికి 10-15 సార్లు ఫోన్ చేస్తే కానీ అపాయింట్మెంట్ తేదీ ఖరారు కాదు. ‘నాలుగైదు రోజుల్లో లేదా ఈ వారంలోనే’ అని చెప్పినా, ఆర్నెల్లకు కూడా ఆ అపాయింట్మెంట్ రాదు. సీఎం దిల్లీ వెళ్తేనో, జిల్లాకు వచ్చినప్పుడో విమానాశ్రయం/ హెలిప్యాడ్ వద్ద మాత్రమే కలిసి వినతిపత్రాలు అందజేయాలి. అదీ జగన్ స్వయంగా తీసుకోకుండా, విషయమేంటో అడగకుండా, తన కార్యదర్శి ధనుంజయరెడ్డి వైపు చూపిస్తుంటారు. అక్కడా ‘మీ అపాయింట్మెంట్ కావాల’ని అని అడిగితే.. ‘చూడు’ అని పక్కనున్న సహాయకుడికి చెబుతారు కానీ, నిర్దిష్ట హామీ ఇవ్వరు. ఇచ్చిన విజ్ఞాపన పత్రం పరిస్థితేంటో తెలుసుకునేందుకు సీఎంవోకు వెళ్తే, ధనుంజయరెడ్డిని కలిసేందుకు మూణ్నాలుగు గంటల నిరీక్షణ తప్పదు.
‘చూద్దాంలెండి. నేను చెబుతాలే’ అంటూ ఆయన తన ఓఎస్డీకి చెబుతారు. ఓఎస్డీ వద్దకు వెళ్తే సంబంధిత శాఖల కార్యదర్శులకు పంపుతామని అంటారు. అలా కాగితాలు, ఎంపీలు సీఎంవోలో కార్యాలయాలు చుట్టూ తిరగడమే తప్ప, వినతులను పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు కన్పించవు. కేవలం రూ.120 కోట్లు వెచ్చిస్తే తన నియోజకవర్గంలో 10 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే ప్రాజెక్టు పూర్తవుతుందని సీఎంను ఓ ఎంపీ కోరగా అది నేటికీ సాకారం కాలేదు. రెండేళ్లపాటు ఆయన వెంటపడినప్పటికీ, ఆ ఫైలు ఆర్థిక శాఖ వద్దే ఆగిపోయింది. చివరకు ‘మీరు వస్తున్నారే కానీ, ఆ పని జరగదు’ అంటూ ఎంపీకి ఆర్థిక శాఖ అధికారులు ముఖంపైనే చెప్పేశారు.
తన నియోజకవర్గంలో ఇస్కాన్ వారు ఆధ్యాత్మిక కేంద్రం నిర్మించేందుకు భూమి అడుగుతున్నారని, ఉచితంగా కాదు, కొనుక్కుంటామని చెప్పారని ఒక ఎంపీ వచ్చి సీఎంను అడిగారు. ‘ఎందుకు లే. హిందూ సంస్థలకు స్థలమిస్తే వేరేవాళ్లు మనకు ఓట్లు వేస్తారా? ఆ ఒక్క సంస్థతో అక్కడేం అభివృద్ధి అవుతుంది? కావాలంటే అక్కడ మనం 7 స్టార్ హోటల్ కడదాం’ అని సీఎం నిర్ద్వందంగా తోసిపుచ్చినట్లు సమాచారం.
source : eenadu.net
Discussion about this post