ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఉభయగోదావరి జిల్లాలు. జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ అభిమానసంద్రానికి పెట్టింది పేరు. అలాంటి ఉభయగోదావరి జిల్లాల్లో ఆ రెండు పార్టీల అధినేతలు కలిసి నిర్వహించిన రోడ్డు షో గోదావరి జనగర్జనకు అద్దం పట్టింది. తొలిసారిగా చంద్రబాబు, పవన్కల్యాణ్ కలిసి రోడ్డు షో నిర్వహించారు. ‘మేం ఇద్దరం కలిసి రోడ్డు షోలో పాల్గొనడం ఇదే తొలిసారి’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సన్నివేశానికి పశ్చిమగోదావరి జిల్లా తణుకు తొలి వేదిక అయ్యింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వీరిద్దరూ తణుకు, నిడదవోలుల్లో ఎన్నికల సభలు నిర్వహించారు. నిడదవోలు ప్రచార కార్యక్రమంలో వీరికి తోడు భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం లోక్సభ అభ్యర్థిని దగ్గుబాటి పురందేశ్వరి కూడా కలవడంతో జనం ఉత్సాహం రెట్టింపయింది. మూడు పార్టీల అధ్యక్షులు జగన్ పాలనా తీరుపై ఈ ముగ్గురూ నిప్పులు చెరిగారు. వీరి ప్రసంగాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది.
తొలుత తణుకులోని ఎస్ఎంవీఎం పాలిటెక్నిక్ కళాశాలలో హెలికాప్టర్ దిగిన తర్వాత అక్కడి నుంచి సభావేదిక నరేంద్ర కూడలి వరకు రోడ్డు షోగా వచ్చారు. రెండు పార్టీల అభిమానులు పెద్ద ఎత్తున వీరికి స్వాగతం పలికారు. పాలిటెక్నిక్ సెంటర్ నుంచి నరేంద్ర కూడలి వరకు 700 మీటర్ల దూరం ఉంటుంది. ఈ కొద్ది దూరానికే 45 నిమిషాలకు పైగా సమయం పట్టింది. రోడ్డుకు రెండువైపులా పెద్ద ఎత్తున యువత, మహిళలు, జనం వీరికి నీరాజనం పట్టారు. చంద్రబాబు, పవన్కల్యాణ్ ఇద్దరూ ఒకే వాహనంలో జనప్రవాహానికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. టౌన్హాలు కాంప్లెక్సు వద్ద జనసేన అభిమానులు క్రేన్తో గజమాల ఏర్పాటుచేసి ఇద్దరు నాయకుల మెడలో వేశారు. వెంకటేశ్వర థియేటర్ సమీపంలో తెలుగుదేశం అభిమానులు మరో గజమాల ఏర్పాటు చేసి ఇద్దరి మెడలో క్రేన్ సాయంతో వేశారు. వారి వాహనం వెంట యువత పరుగులు తీస్తూ కనిపించారు. అప్పటికే నరేంద్ర కూడలి వద్ద సభాస్థలి వద్ద వేలసంఖ్యలో జనం చేరుకున్నారు. ఎండవేడిమి ఎక్కువగా ఉన్నా మధ్యాహ్నం నుంచి పెద్దసంఖ్యలో జనం తరలివచ్చారు. చంద్రబాబు, పవన్కల్యాణ్ ఊరేగింపుతో తరలివచ్చిన వేలమంది అభిమానులు వచ్చేసరికే వేదిక ముందుభాగం కిక్కిరిసిపోయింది. ఊరేగింపుతో పాటు వచ్చినవారు వేదిక ముందుకు వెళ్లేందుకు చేసిన ప్రయత్నంలో అక్కడున్నవారికి ఊపిరి సలపని పరిస్థితి ఏర్పడింది. వేదికకు అటూ, ఇటూ పెద్దసంఖ్యలో జనం చేరారు.
రోడ్డుషోకు, సమావేశానికి యువత, మహిళలు భారీగా తరలివచ్చారు. చంద్రబాబు ప్రసంగానికి, పవన్కల్యాణ్ మాటలకు పెద్ద ఎత్తున స్పందన కనిపించింది. వీరి ప్రశ్నలకు జనం నుంచి సానుకూల స్పందన కనిపించింది. ఈ కూటమికి తాము మద్దతు పలుకుతున్నామంటూ చేతులెత్తి ప్రతిస్పందన తెలియజేశారు. ‘‘అనుభవం నాది… పవర్ పవన్కల్యాణ్ది’ అంటూ శ్రేణులను చంద్రబాబు ఉత్సాహపరిచారు. యువత కన్నెర్రతో జగన్ లండన్ పారిపోవాలన్నారు. రాష్ట్రానికి ఎన్డీయే ఆక్సిజన్ అని… ఇక్కడ అభివృద్ధికి కేంద్ర సహకారం అవసరమని ప్రజలకు ఆయన వివరించారు. చంద్రబాబు ప్రసంగం ఒక క్రమపద్ధతిలో కొనసాగింది. తొలుత కూటమి ఏర్పడటానికి కారణాలు వివరించారు. కూటమి రాష్ట్రానికి ఎలా బలమో విశ్లేషించారు. తర్వాత అయిదేళ్లపాటు జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందని, రంగాల వారీగా ఎలా నష్టపోయామో వివరించారు. ఆ తర్వాత తెదేపా, జనసేన, భాజపా ప్రభుత్వం రాబోయే అయిదేళ్లలో ఏం చేస్తుందో వివరించారు. ‘నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పవన్కల్యాణ్ నా కోసం పని చేశారు’ అని పొగిడారు. స్థానిక మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై ఇద్దరు నేతలూ ధ్వజమెత్తారు. ఆయన రైతులను ఎలా ఇబ్బంది పెట్టిందీ చెప్పడంతో పాటు తణుకులో ఎంత అవినీతి జరిగిందో, ఆయన టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో ఎంత దోచుకున్నారో విశ్లేషించారు. పవన్కల్యాణ్ మంత్రి కారుమూరిపై ధ్వజమెత్తారు. ఇక్కడ సంపాదించిన మొత్తంతో హైదరాబాద్లో వ్యాపారాలు చేశారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, భాజపా అందరూ రాష్ట్ర అభివృద్ధి కోసం కొంత తగ్గి సీట్లు తగ్గించుకుని పోటీ చేశామన్నారు. తణుకులో తొలుత జనసేన పోటీచేస్తుందని ప్రకటించినా, ఆ తర్వాత రాష్ట్రం కోసం త్యాగం చేయాల్సి వచ్చిందన్నారు. తన అన్న నాగబాబు స్థానాన్నీ త్యాగం చేసినట్లు పేర్కొన్నారు.
source : eenadu.net
Discussion about this post