‘‘బాబాయి హత్యను కప్పిపుచ్చడానికి సాక్షి పత్రికలో గుండెపోటు అని వార్తలు రాయించారు. తర్వాత గొడ్డలిపోటు అన్నారు. ఆ గొడ్డలి ఎవరిచ్చారో చెప్పాలని చెల్లెలు సునీత అడుగుతున్నారు. సమాధానం ఎందుకు చెప్పడం లేదు. బాబాయి హత్య గురించి ఎవరూ మాట్లాడకూడదని గతంలో కోర్టుకెళ్లి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణ కావాలని కోరి.. అధికారంలోకి వచ్చాక సీబీఐ దర్యాప్తు వద్దని నాటకాలు ఆడారు. ఇప్పుడు చెల్లెలు నిలదీస్తుండటంతో సాక్షిలో తప్పుడు రాతలు రాయిస్తున్నారు. ధైర్యముంటే బాబాయి హత్యపై చర్చకు రావాలి’’ అని సీఎం జగన్కు తెదేపా అధినేత చంద్రబాబు సవాల్ విసిరారు. సోమవారం శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో జరిగిన ‘రా కదలిరా’ సభలో ఆయన మాట్లాడారు.
సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. చెల్లెలు సునీత జగన్ వద్దకు వెళ్లి సీˆబీఐ విచారణ జరిగేలా చూడాలని కోరితే.. అవినాష్ భాజపాలోకి వెళ్లిపోతారన్న సాకుతో సీబీఐ విచారణ కోరనని చెప్పిన దొంగ ఈ సీఎం అని విమర్శించారు. హత్యలు చేసేవ్యక్తి ముఖ్యమంత్రి పదవికి అర్హులా? ప్రజలు ఆమోదిస్తారా? ఈరోజు రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు రక్షణ ఉందా? ఇలాంటి దుర్మార్గుడు రాష్ట్రానికి అవసరమా? అని ప్రశ్నించారు. ‘‘ఈ మధ్య జగన్ ఇది నా మార్క్ అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. వాస్తవానికి చెత్తపన్ను వేయడం, విద్యుత్తు ఛార్జీలు పెంచడం, నాసిరకం మద్యం, నిరుద్యోగాన్ని పెంచడం, అన్న క్యాంటీన్లు కూల్చేయడం, సాగునీటి ప్రాజెక్టులను అటకెక్కించడం జగన్ మార్క్. బాబాయి హత్య, సొంత చెల్లెలు షర్మిల పుట్టుకపైనా దుష్ప్రచారం చేయడం, అమ్మను గెంటేయడం జగన్ మార్క్. విధ్వంసం మాత్రమే జగన్ మార్క్’’ అని చంద్రబాబు విమర్శించారు.
ఆంక్షలు లేకుండా సంక్షేమం ఇస్తాం
‘‘జగన్ ఒక చేత్తో రూ.10 ఇచ్చి మరో చేత్తో రూ.100 దోచేస్తున్నారు. అసలు పింఛను పథకాన్ని ప్రారంభించింది ఎన్టీ రామారావు. రూ.200 ఉన్న పింఛన్ను రూ.2 వేలు చేసింది కూడా తెదేపానే. 2019లో కూడా తెదేపా అధికారంలో వచ్చి ఉంటే మొదటి నెల నుంచే రూ.3 వేలు పింఛను ఇచ్చేవాళ్లం. జగన్ మాత్రం అవ్వాతాతలను మోసం చేసి ఐదేళ్ల తర్వాత రూ.3 వేలు చేశారు. ఏదైనా కారణంతో ఒక నెల పింఛను తీసుకోకపోతే మరుసటి నెలలో కట్ చేస్తున్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలలు పింఛను తీసుకోకపోయినా నాలుగో నెలలో అందజేస్తాం. జగన్ కంటే మిన్నగా సంక్షేమం అందిస్తాం. ఇంటింటికీ వచ్చి పింఛన్లు పంపిణీ చేస్తాం. సంక్షేమ పథకాల విషయంలో ఎలాంటి ఆంక్షలు విధించం’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
వాలంటీర్లకు భరోసా కల్పిస్తాం
తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను తొలగించబోమని, కొనసాగిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ‘‘మీ ఉద్యోగాల తీసేయం. వాలంటీరు వ్యవస్థ కొనసాగిస్తాం. కానీ మీరు వైకాపా దొంగలకు పనిచేయొద్దు. మీలోనూ మంచివారు, చదువుకున్నవారు ఉన్నారు. మీకు మంచి భవిష్యత్తు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ప్రతిభ ఉన్న వాలంటీర్లకు శిక్షణ ఇప్పించి వారి సామర్థ్యాలను పెంచుతాం. తమ్ముళ్లూ మీరు నా మాటాగా ఈ విషయం ప్రతి ఒక్క వాలంటీరుకు చెప్పండి. మీరు కూడా రాష్ట్రంలోనే పుట్టారు. రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పుట్టిన సైకో దిగిపోతే తప్ప భవిష్యత్తు లేదని చెప్పండి. రాష్ట్రంలోని యువతకు ఏడాదికి 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. యువతను ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలతో అనుసంధానం చేస్తాం. ఇంటి నుంచి పనిచేసుకునేలా వెసులుబాటు కల్పిస్తాం. మండలాల్లో వర్క్స్టేషన్లు పెట్టి అక్కడి నుంచి పని చేసుకునేలా ఏర్పాట్లు చేస్తాం. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి అందిస్తాం. తెదేపా హయాంలో ఐటీ ఉద్యోగాలు ఇస్తే వైకాపా వాళ్లు మటన్, ఫిష్ మార్కెట్, మద్యం దుకాణాల్లో ఉద్యోగాలు ఇచ్చారు. తెదేపాకు, వైకాపాకు తేడా మీరే గమనించండి’’ అని చంద్రబాబు సూచించారు.
తెదేపా-జనసేన కూటమిదే విజయం
‘‘మొన్ననే ఇక్కడ జగన్ సిద్ధం సభ పెట్టారు. వేలాది ఆర్టీసీ బస్సుల్లో జనాలను తరలించారు. కాని తెదేపా-జనసేన సభలకు మాత్రం బస్సులు ఇవ్వడం లేదు. ఇది సైకో రూల్. అయినా ఏం ఫర్వాలేదు. తెలుగుదేశం తమ్ముళ్లు మోటార్ బైక్లు వేసుకుని సభకు వస్తున్నారు. తెదేపా-జనసేన కలయిక వైకాపా పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. తెదేపా-జనసేన కలయిక రోజే వైకాపా ఓటమి నిర్ణయమైంది. వైకాపా అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావు. తమ్ముళ్లు ఈ 40 రోజులు సైకిల్ ఎక్కండి. దప్పిక వేస్తే గ్లాసును పక్కన ఉంచుకోండి. సైకోను ఇంటికి పంపించే సమయం ఆసన్నమైంది. వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం తథ్యం’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
source : eenadu.net
Discussion about this post