వ్యవసాయ శాఖామంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నిందితుడిగా ఉన్న ఫోర్జరీ కేసులో ఆధారాలు, సాక్ష్యాలు, ఇతర పత్రాలతో కూడిన ప్రాపర్టీ నెల్లూరు కోర్టు నుంచి చోరీకి గురైన కేసులో ఆయన ప్రమేయం లేదని తేల్చేసేందుకు సీబీఐ తెగ అత్యుత్సాహం ప్రదర్శించింది. మంత్రిని కాపాడాలనే ఏకైక లక్ష్యంతోనే దర్యాప్తు చేపట్టిందా అన్నట్లుగా వ్యవహరించింది. సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రాన్ని పరిశీలిస్తే ఎవరికైనా సరే ఇదేం పరిశోధన అని అనిపించకమానదు. అందులో పేర్కొన్న అంశాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ చోరీ ఘటనతో కాకాణికి సంబంధమే లేదంటూ చెప్పిన విషయాలేవి తార్కికంగా లేవు. వాటి మధ్య పొంతన లేదు. కొన్ని మరీ హాస్యాస్పదంగా ఉన్నాయి. సీబీఐ లాంటి ప్రఖ్యాత సంస్థ ఇలా లొసుగులతో దర్యాప్తు చేయడమేంటి అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కాల్ డేటా ఎలా తీసుకున్నట్లు?
చోరీ కేసులో నిందితులైన సయ్యద్ హయత్, ఖాజా రసూల్ చిల్లర దొంగతనాలు చేసుకుంటూ ఫుట్పాత్లపై నివసిస్తుంటారని, వారి వద్ద కనీసం మొబైల్ ఫోన్లు కూడా లేవని అభియోగపత్రంలో ఒక పేరాలో సీబీఐ పేర్కొంది. కాకాణి గోవర్ధన్రెడ్డి, ఆయన సన్నిహితులు, పీఏల కాల్డేటా రికార్డులు తీసుకుని విశ్లేషించామని… వాటిల్లో వారెక్కడా నిందితులతో మాట్లాడినట్లు లేదని మరో పేరాలో ప్రస్తావించింది. దీన్నిబట్టి ఈ చోరీతో మంత్రికి ఎలాంటి సంబంధమూ లేదంటూ తేల్చేసింది. అసలు నిందితుల వద్ద మొబైల్ ఫోన్లే లేవని చెబుతూ, మరోవైపు వారితో కాకాణి, ఆయన సంబంధీకులెవరూ మాట్లాడినట్లు కాల్ డేటా రికార్డుల్లో ఎక్కడా లేదని పేర్కొనడం హాస్యాస్పదం కాదా? అసలు నిందితుల వద్ద మొబైల్ ఫోన్లే లేకపోతే వారితో మాట్లాడినట్లు కాల్డేటా రికార్డులు మాత్రం ఎలా లభిస్తాయి?
వారు జైలుకెళ్లి నిందితులను కలుస్తారా?
‘కోర్టులో చోరీ ఘటనలో అరెస్టైన సయ్యద్ హయత్, ఖాజా రసూల్ అరెస్టై జైల్లో ఉన్నంత కాలం వారిని కొద్ది మంది బంధువులు మినహా ఇతరులు ఎవరూ కలవలేదు. వారిరువురికీ బెయిల్ లభించినా ష్యూరిటీలు సమర్పించేవారు లేక విడుదల కాలేదు. కాబట్టి ఈ ఘటనలో కుట్ర లేదనేది స్పష్టమవుతోంది’ అని సీబీఐ పేర్కొంది. కుట్రకు రూపకల్పన చేసినవారెవరైనా సరే ఆ నిందితుల్ని జైలుకు వెళ్లి కలుస్తారా? అలా కలిస్తే తాము దొరికిపోతామని తెలియనంత అమాయకులా? వారికి ష్యూరిటీలు సమర్పించి బయటకు తీసుకొస్తే.. దాని వెనుక ఎవరున్నారనేది వెల్లడైపోదా? ఈ మాత్రం తార్కికంగా సీబీఐ ఎందుకు ఆలోచించలేదు?
తాళాలు.. ఎందుకు మరిచిపోయినట్లు?
‘కాకాణి నిందితుడిగా ఉన్న ఫోర్జరీ కేసు ప్రాపర్టీని బెంచ్ క్లర్క్ నాగేశ్వరరావు తన బీరువాలో భద్రపరిచారు. చోరీ జరిగిన రోజున దాని తాళం తెరిచి తిరిగి వేయడం మరిచిపోయారు. దాన్ని ఆ బీరువాకే వదిలేశారు. దీంతో చోరీకి వెళ్లిన నిందితులు ఆ బీరువాలోని ప్రాపర్టీని దొంగిలించారు’ అని సీబీఐ అభియోగపత్రంలో పేర్కొంది. ఈ వ్యవహారంలో నాగేశ్వరరావుది ఎలాంటి తప్పూ లేదని తేల్చేసింది. అసలు ఆ రోజే బీరువాకు తాళాలు వేయకుండా ఎందుకు వదిలేసినట్లు? అందులోనే కాకాణి నిందితుడిగా ఉన్న కేసు ప్రాపర్టీ ఉండటమేంటి? దొంగతనానికి వచ్చినవారికి అవి మాత్రమే దొరకడమేంటి? అనేదానిపై సీబీఐ అభియోగపత్రంలో తగిన సమాధానాలు లేవు. నాగేశ్వరరావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే సీబీఐ ఈ నిర్ధారణకు వచ్చేసింది.
కాల్ డేటా ఆధారంగా తేల్చేయడమేంటి?
కాకాణి కాల్ డేటా రికార్డ్స్ విశ్లేషిస్తే ఎక్కడా ఈ చోరీ కేసుతో సంబంధమున్నట్లు కనిపించలేదని సీబీఐ పేర్కొంది. అంటే కాల్ డేటా రికార్డ్స్ మీద ఆధారపడి దర్యాప్తు తేల్చేయడం ఏంటి? ఆయన్ను ఎవరైనా ప్రత్యక్షంగా కలిశారా? ఆయన తరఫు వ్యక్తులు ఎవరైనా నిందితుల్ని, లేదా కేసుతో సంబంధమున్న ఇతర వ్యక్తుల్ని కలిశారా అనే కోణంలో లోతుగా ఎందుకు దర్యాప్తు చేయలేదు? కుట్రలకు పాల్పడేవారెవరైనా వారి సొంత ఫోన్లు, పీఏల ఫోన్ల నుంచి మాట్లాడతారా? వేరే సిమ్లు తీసుకుని మాట్లాడి ఉండొచ్చు కదా! లేదా ఇతర మార్గాల్లో సంప్రదింపులు జరిపి ఉండొచ్చు కదా! మరి ఆ కోణాన్ని సీబీఐ ఎందుకు విస్మరించింది.
source : eenadu.net
Discussion about this post